18 పురాణాలు, మహాభారతం, భాగవతం , బ్రహ్మసూత్రాలు మొదలగునవి రాసిన వేదవ్యాసుడు కేవలం పురాణాల్లో తప్ప విడిగా జ్యోతిషం గురించి గ్రంధాలు ఏమీ రాయలేదు? ఎందుకు? జ్యోతిషం మీద పూర్తి నమ్మకం లేదా ? జ్యోతిషంను వ్యాసుడు విడిచిపెట్టేసాడా?
వేదవ్యాసుడు జ్యోతిషంను విడిచిపెట్టలేదు. నిర్లక్షం చేయలేదు. అలాంటి ఉద్దేశ్యం ఉంటే అసలు పురాణాల్లో జ్యోతిషం ప్రస్తావన చేసేవాడే కాదు. జ్యోతిషం గురించి వ్యాసునికి పూర్తి అవగాహన వుంది. అయన తండ్రి పరాశర మహాముని రాసిన జ్యొతిషశాస్త్రానికి పరిహార భాగం వ్యాసముని రాసాడు. జ్యోతిషశాస్త్రం పూర్వ జన్మల కర్మలను అనుసరించి ప్రస్తుత జన్మలో ఎటువంటి ఫలితాలు పొందుతామో చెబుతుంది. ఉదాహరణకు ఆలస్య వివాహము, విద్య లేదా ఉద్యోగం సరిగా లేక పోవడం, అనారోగ్య సమస్యలు మొదలగునవి పూర్వజన్మల కర్మల వల్ల జరగుతాయి. పూర్వకాలంలో సంతానం కోసం పుత్రకామేష్టియాగం, ఏదైనా కోరికలకోసం తపస్సు చేయడం ( హిరణ్యకశిపుడు, రావణాసురుడు, మొదలగు వారు ) మనం చదువుకొన్నాము. ఆ యుగాల్లో వారికి ఆయుర్దాయము చాలా ఉండేది. కలియుగంలో మానవుని పూర్తి ఆయర్దాయం జ్యోతిశ్శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలు. జాతకంలోని దోషాలవల్ల (పూర్వజన్మల కర్మలవల్ల) అంతకాలం మానవులు జీవించరు. అందువల్ల కలియుగంలో యజ్ఞ-యాగాలు చేయడం కష్టం.
కారణం సమయం, ధనం(డబ్బు), చేయించే బ్రాహ్మణులు దొరకడం కష్టం. ఇలాంటి పరిస్థితి ఊహించే వేదవ్యాసుడు అందరూ సులభంగా చేసుకొనే పరిహారాలు గురించి ఆలోచించాడు. మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి డబ్బు కావాలి అంటే శ్రీసూక్త పారాయణ చెయ్యాలి. అది స్వరయుక్తంగా ఉంటుంది. గురు ముఖంగా నేర్చుకోవాలి. కలియుగంలో ఉండే పరిస్థితులు తెలిసిన వ్యాసముని పురాణాల్లో అనేక స్తోత్రాలు రాసాడు. శ్రీసూక్తం బదులుగా లక్ష్మీసహస్రం , అష్టోత్తరశతనామస్తోత్రం రాసాడు. విష్ణుసహస్రనామస్తోత్రం, లలితాసహస్రానమస్తోత్రం ఇలా చాలా స్తోత్రాలు రాసి వాటి ఫలశ్రుతిలో ఆస్తోత్రం పారాయణ మూలంగా ఏమి ఫలితం వస్తుందో కూడా రాసాడు. ఇక్కడే వ్యాసుని దూరదృష్టి మనము గమనించాలి. కలియుగంలో మానవులు కలియుగ లక్షణం మూలంగా అల్పబుద్ది కలిగి ఉంటారని, భక్తిచింతన లేక కర్మభ్రష్టులు నాస్తిక వాదులుగా అవుతారని, చాలా రకాల మతాలు, సంస్కృతులు వచ్చి దేన్ని అనుసరించాలో సందేహంలో పడతారని, దొంగ గురువులు దొంగస్వాములు తయారై ఎవరికీ తోచిన విధంగా వారు చెప్పడం మూలంగా భగవంతునిపై నమ్మకము పోతుంది అని ఆలోచించి అన్ని మతములవారికి (అన్ని రకాల సంప్రదాయాలవారికి) కావలిసినవిధంగా అన్నిరకాల స్తోత్రాలు రాసాడు. మనము గమనిస్తే అన్ని స్తొత్రాల్లొనూ ఫలశ్రుతుల్లో ధనం , సంతానం, భోగం, మోక్షం ఇంకా చాలా పొందుతారని రాసాడు. అన్నిటిల్లొనూ ఈ ఫలితం వస్తుంది అన్నప్పుడు ఇన్ని స్తోత్రాలు ఎందుకు అంటే ఎవరికి ఇష్టం అయిన దేవత ఆరాధన వారు చేసుకోవడానికి. మరి బ్రహ్మసూత్రాలు రాసిన వ్యాసుడు, “ఉన్నది ఒకటే అన్ని లేవు” అని అన్న అద్వైతమతవాది ఇన్ని ఎందుకు రాసాడు? "ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి" అనగా ఆకాశం నుంచి పడిన వర్షం నదిగా మారి ఎలా సముద్రంలో కలుస్తుందో ఏ దేవతకి నమస్కారం చేసి అది కేశవునికి చెందుతుంది అని అర్ధం. అనగా శ్రీమహావిష్ణువుకి చెందుతుంది అని అర్ధం. ఇక్కడ చిన్న పరిశీలన శ్రీమహావిష్ణువు మాత్రమే సకల దేవత స్వరూపమా? రుద్రాధ్యాయం లో ఒక మంత్రం "హరికెశాయోపవీతినె పుష్టానాం పతయే నమః" ఇక్కడ హరికేశ అనగా హరి+క+ఈశ(విష్ణు+బ్రహ్మ+శివ) అనగా హరికేశాయ అనగా త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు అని ఉపవీతినే పుష్టానాం అనగా యజ్ఞోపవీతం ధరించినవాడు అని అర్ధం. కేశవ అనే శబ్దంలో విష్ణువు కనడుతున్నప్పటికి (కేశవ అనగా క + ఈశ అనగా బ్రహ్మ, శివుడు ) బ్రహ్మ, విష్ణు, శివ అనే మూడు నామాలు ఉన్నయి. దేవతలు అందరు ఒకటే భావంలో ఉండాలి. పరబ్రహ్మ ఒక్కడే అని నదులు అన్నీ సముద్రంలో కలిసనట్టుగా భగవంతుణ్ణి ఏ రకంగా స్తోత్రం చేసినా ఫలితం ఒక్కటే అనీ తెలిసినా మనకోసము ఇన్ని స్తోత్రాలు రాసాడు. ఆయన ఉద్దేశ్యం అందరు అన్నీ చెయ్యలేరు. వారి కర్మను అనుసరించి వారు ఏది చేసిన ఫలితం రావాలి అని వ్యాసుని ఉద్దేశ్యం. ఇక్కడ మరొక్క ప్రశ్న? వ్యాసుడు పరిహారాలు రాసాడు అన్నప్పుడు ఇన్ని స్తోత్రాలు పూజలు వ్రతాలు రాస్తే మనము ఏది చెయ్యాలి? ఎలా చెయ్యాలి అన్నది మరొక ప్రశ్న. పూర్వజన్మలకర్మలు తప్పించుకోవడం అంత సులభం కాదు. మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజు ఎన్నో వ్రతాలు చేసాడు అంతగొప్పవాడైన ధర్మరాజే అన్ని వ్రతాలు చేయవలసివస్తే మనం చేసే పూజలు, వ్రతాలూ ఏపాటివి? వచ్చే ఫలితం ఎంత? పూర్వ జన్మల్లోని కర్మ ప్రస్తుత జన్మ మీద ఎలా ప్రభావం చూపుతోందో జాతకం, ప్రశ్న విధానాల్లో పరిశీలన చేసి ఏ పూజ చేయాలి, ఏ జపం చేయాలనేది నిర్ణయం చేయాలి. అంతేకాని ఏలినాటి శని, కాలసర్పదోషం, కుజ దోషం ఇలాంటివి పైపైన చూసి జపాలు పూజలు చేస్తే సరైన ఫలితం రాదు. జాతకం పరిశీలన చేసిన తర్వాత పరిహారాలు చేసుకొనే సమయంలో సరైన నియమాలు పాటించి పూజలు చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది
వేదవ్యాస మహాముని చేసిన కృషిని అణు మాత్రంగానే ఇక్కడ చర్చించగలిగాము. సాక్షాత్ నారాయణ స్వరూపం అయిన వేదవ్యాసమహముని అనుగ్రహం అందరూ పొందాలని ఆశిస్తున్నాను
Add new comment